కాలం గడిచిపోతోందోయ్ అని గుర్తించుకునేందుకూ, హెచ్చరించేందుకూ ఎన్నెన్ని సూచికలో! న్యూయియర్లు, పుట్టిన్రోజులు, వార్షికోత్సవాలు .. అమెరికాలో అయితే, వసంతంలో గడియారాన్ని ముందుకు తొయ్యడం, శిశిరంలో వెనక్కి లాగడం .. ఇదో తతంగం. ఈ సంవత్సరం మొన్నమొన్ననే మొదలయినట్లుంది, ఇంకా చెక్కుల మీద 2009 అని రాయడం పూర్తిగా అలవాటయినట్టే లేదు, అంతలోనే సంవత్సరం అయ్యేపోవస్తోంది. కాలేజిలో నా సహాధ్యాయి మిత్రుడొకడు మొన్న కాల్చేసి చెప్పాడు, మా బేచి స్నాతకులయ్యి వచ్చేయేడు రజతోత్సవంట. కాలం అలా పరిగెత్తుతూనే వుంటుంది. మన చేతిలో వున్నది ఈ క్షణమే దాని విలువ నెరిగి సద్వినియోగ పరుచుకోవడమే మనం చెయ్యగలిగిందల్లా. అందుకనే దీన్ని ఆంగ్లంలో ప్రెజెంట్ అన్నారు .. అది బహుమతే .. నిజంగా!!
అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టించుకునే తీరికలేనంత పని వత్తిడి. ఎప్పుడన్నా రెణ్ణిమిషాలు తీరిక దొరికితే నా అభిమాన బ్లాగుల్లో ఓ లుక్కేసి చదివింది నచ్చితే ఓ రెండు వాక్యాలు గిలకడం. యాహూన్యూసులో కూడా వార్తలు చదివేందుకు కుదరట్లేదు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించగలరు. ఏతన్మధ్య, గత వారాంతంలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు జరిగినై. ముందుగా శనివారం ఇక్కడ స్థానిక డిట్రాయిట్ తెలుగు సమితివారి దీపావళి వేడుకల్లో
నరకాసురవధ నాటిక ప్రదర్శించాము. ఈ కార్యక్రమం మా వూళ్ళో పేరెన్నిక గన్న నాట్యాచార్యులు శ్రీమతి సాంధ్యశ్రీ ఆత్మకూరిగారి పర్యవేక్షణలో జరిగింది. అందులో నేను నరకాసురుడి పాత్ర ధరించాను. సంధ్యగారి వంటి మంచి సృజనాత్మక దృష్టికలిగిన సమర్ధులతో పని చెయ్యడం ఒక అదృష్టమైతే, కొన్ని పదులగంటలు టీనేజర్లైన పిల్లల సాంగత్యంలో గడుపుతూ వారి ఉత్సాహాన్ని ఆస్మాసిస్ ద్వారా వంటపట్టించుకోవడం కూడా చాలా సరదా అయిన అనుభవం. పిల్లలందరూ చాలా బాగా చేశారు .. ముఖ్యంగా సత్యభామగా చిరంజీవి అర్చిత అద్భుతంగా నటించింది. అన్నట్టు మన కాలాస్త్రి శ్రీ కూడా సూత్రధారునిగా తనవంతు పాత్ర సమర్ధవంతంగా పోషించారు.ఇదయినాక, మరునాడు, ఆదివారంనాడు, మా వూరి నిలయవిద్వాంసులతో ఒక కర్నాటక సంగీత కచేరీ నిర్వహించాము కొందరు మిత్రులం కలిసి. కొంతకాలంగా మా వూళ్ళో అస్సలు కచేరీలనేవి జరక్కపోవడం ఒకటీ, అదికాక, వూళ్ళో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉండి కూడా, వారి ప్రతిభకి సరైన వేదిక దొరక్కపోవడం ఒకటీ గమనించి, కొందరు మిత్రులం కలిసి ఈ కచేరీ ఏర్పాటు చేశాం. రెండు భాగాల కచేరీ. ముందుగా శశిధర్ గారి వీణావాదనం, మృదంగం మీద జయసింగం, ఒక గంటన్నరసేపు. భైరవి అటతాళ వర్ణంతో మొదలెట్టి , రాగాల ఎంపికలో చక్కటి వైవిధ్యం కనబరుస్తూ, పూర్వికళ్యాణిలో మీనాక్షిని సాక్షాత్కరించి, శంకరాభరణంలో ఎదుట నిలచితే నీ సొమ్మేమి పోవునని రాముణ్ణి నిలదీసి, ధనశ్రీ తిల్లానాతో ముగించారు. తదుపరి మల్లాజోస్యుల దంపతులు (శ్రీకాంత్, పావని) వయొలిన్ ద్వయం, రాజశేఖర్ ఆత్మకూరిగారి మృదంగవాద్య సహకారంతో. శ్రీరాగవర్ణంతో మొదలై లాల్గూడివారి కానడ తిల్లానాతో ముగిసిన వీరికచేరీలో శ్రీరంజని రాగం తానం పల్లవి తలమానికంగా నిలిచింది. వందమందికి పైగా శ్రోతలు హాజరవడం నాకు చాలా ఆనందం కలిగించింది.
వారాంతపు రెండ్రోజులూ ఇంత చక్కటి అనుభూతుల్ని మూటగట్టుకున్నాక, సోమవారంనాడు పనిలో తగిలిన ఎడాపెడా వాయింపులతో బుర్ర వాచిపోయి సాయంత్రానికల్లా ఒక విధమైన నిర్వేదం వచ్చేసింది .. ఆనందం కానీ తృప్తికానీ ఇంత క్షణికమా, ఇంత అశాశ్వతమా అని చాలా ఆశ్చర్యపోయాను. అఫ్కోర్సు, అది విధి నిర్వహణ కాబట్టి, ఎన్ని వాయింపులు తగిల్నా తట్టుకుని నిలబడ్డం, అదొక అనుభవంకింద జమ వేసుకుని ముందుకి సాగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మర్నాటికల్లా నిలదొక్కుకున్నా ననుకోండి. అసలు, మాట వరసకి చెబుతున్నా, జీవితంలో ఈ వొడిదుడుకులు ఇలా ఎలా పక్కపక్కనే వస్తాయో అని.
ఆకులు రాలే పోయాయి వారాంతంలో వచ్చిన గాలివానకి. కానీ అక్టోబరు నెలంతా గొప్ప రంగుల్తో అలరించింది ప్రకృతి. ఎటుచూసినా రంగులు, రంగులు .. గుట్టలు గుట్టలుగా రాశులు రాశులుగా రంగులు. రెండేళ్ళ క్రితం ఈ ఆకురాలు కాలపు అనుభవాన్ని రాసుకున్న వైనం ఇక్కడ.


